తిరుమల, 2023 మే 03: శ్రీవేంకటేశ్వరస్వామికి అపరభక్తురాలు, భక్తకవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి ఉత్సవం మే 4వ తేదీ గురువారం తిరుమలలో ఘనంగా జరుగనుంది.
శ్రీవారిపై అచంచలమైన భక్తివిశ్వాసాలు ప్రదర్శించిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 1730వ సంవత్సరంలో జన్మించారు. శ్రీ రాఘవేంద్రస్వామి, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి లాగా తన బృందావనంలోనే 1817లో సజీవ సమాధి చెందారు. తిరుమలలో అన్నదానాన్ని ప్రారంభించినందుకు గుర్తుగా వెంగమాంబ పేరు ముందు మాతృశ్రీ అనే పదం చేరింది. టిటిడి ప్రతి ఏడాదీ వెంగమాంబ జయంతిని క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది.
ఈ సందర్భంగా తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో సాయంత్రం 4.30 గంటలకు పుష్పాంజలి సమర్పిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కూడి శ్రీమలయప్పస్వామివారు ఆలయం నుండి ఊరేగింపుగా బయల్దేరి సాయంత్రం 6 గంటలకు నారాయణగిరి ఉద్యానవనాల్లోని శ్రీ పద్మావతి పరిణయమండపానికి వేంచేపు చేస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు ప్రముఖ సంగీత విద్వాంసులు తరిగొండ వెంగమాంబ సంకీర్తనల గోష్ఠిగానం నిర్వహిస్తారు. అనంతరం విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతిస్వామివారు, ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారు అనుగ్రహభాషణము చేయనున్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
0 Comments
Hello buddy if you have any doubts feel free to comment