ఒక పదార్థం గుండా విద్యుత్ సరఫరా కావడం అంటే ఆ పదార్థంలో ఎలక్ట్రాన్లు లేదా విద్యుదావేశం ఉన్న కణాలు లేదా అయాన్లు ప్రవహించడమే. లోహాలు(metals), బొగ్గు, గ్రాఫైటు వంటి అలోహాల్లో (non-metals) స్వేచ్ఛగా అటూ ఇటూ కదలగల ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఉప్పు ద్రావణం, సముద్రపు నీరు, తాగే నీరు, గంధకామ్లం వంటి ద్రవ పదార్థాల్లో విద్యుదావేశం ఉన్న అయాన్లు ఉంటాయి. ఇలాంటి ఘన, ద్రవ పదార్థాలను విద్యుత్ పొటన్షియల్ ఉన్న రెండు బిందువుల (poles) మధ్య ఉంచినపుడు విద్యుత్ సరఫరా అవుతుంది. అంటే రుణధ్రువం వైపునకు ధనావేశిత (positively charged) కణాలు, ధనధ్రువం వైపు రుణావేశిత (negatively charged) కణాలు ప్రయాణిస్తాయి. ఈ స్థితినే మనం విద్యుత్ ప్రవహించడం అంటాం. అయితే గాలిలో అణువులు తటస్థం(neutral)గాను, దూరదూరంగాను ఉంటాయి. కాబట్టి ఇలాంటి సాధారణ వాయువులను సాధారణ పొటెన్షియల్ తేడా ఉన్న బిందువుల మధ్య ఉంచితే, ఆ వాయువుల్లో చలించే విద్యుదావేశిత కణాలు ఏమీ లేకపోవడం వల్ల కరెంట్ పాస్ కాదు. స్వచ్ఛమైన నీరు, బెంజీన్, అసిటోన్, ఆల్కహాలు వంటి ద్రవాల్లో కూడా కరెంటు ఏమంత గొప్పగా పాస్ కాదు. కానీ అధిక వోల్టేజి ఉండే బిందువుల మధ్య గాలిలో కూడా విద్యుత్ ప్రసరిస్తుంది. అప్పుడు వాయు అణువులు అయనీకరణం చెందుతాయి.
#SCIENCE
0 Comments
Hello buddy if you have any doubts feel free to comment